దిత్వా తుఫాన్ ప్రభావం: నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంను ఆనుకుని శ్రీలంక తీరంలో ‘దిత్వా తుఫాన్’ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా.. నేడు ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక, రేపు తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే బాపట్ల, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఎల్లుండు (ఆదివారం) కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. గుంటూరు, నంద్యాల, పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఈ తుఫాన్ కారణంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు పాటు కురిసే వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే సమయంలో ఏపీలో చలి తీవ్రత కూడా కొనసాగుతున్నట్లు తెలిపింది. వర్షాల కురవని మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.