శ్రీవారి దర్శనానికి భారీ క్యూ—నిమిషానికి ప్రవేశం ఎంతమంది?
పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడానికి డాక్టర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో ‘శ్రీవారి సేవకులు’గా వైద్య నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. టీటీడీ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా, అన్నదానం, విద్య, వైద్య రంగాల్లో చిరునామాగా మారాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీకి సీఎం సూచించారు. భక్తుల రద్దీని పర్యవేక్షించడానికి సాంకేతికతను ఉపయోగించాలని, టీటీడీ పోర్టల్ను ఆర్టీజీఎస్తో అనుసంధానం చేయాలని సూచనలు చేశారు. అన్ని టీటీడీ సేవలను వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకురావాలని కూడా దిశా నిర్దేశం చేశారు. తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాలకు అవసరమైన ఏర్పాట్లను పక్కాగా చేయాలని చంద్రబాబు సూచించారు. ఎక్కువమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని.. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారిని నిమిషానికి 80 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు చంద్రబాబుకు తెలిపారు. అంతేకాదు తిరుమలలో పండుగలు, ప్రత్యేక సమయాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నామని.. అన్నప్రసాదం, లడ్డూ నాణ్యత పెంచామని కూడా వివరించారు. అన్నప్రసాదంలో అదనంగా వడను అందిస్తున్నామని.. 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించడానికి కిచెన్ను ఆధునీకరించబోతున్నట్లు తెలిపారు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడానికి ఇతర ఆస్పత్రుల్లో పనిచేసే నిపుణులైన డాక్టర్లకు కూడా అవకాశం కల్పించాలని ఆదేశించారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య నిపుణులను “శ్రీవారి సేవకులు”గా ఆహ్వానించాలని సూచించారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో డాక్టర్లు ఈ సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయశాఖ, టీటీడీపై సమీక్ష నిర్వహించారు.. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. టీటీడీ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలు చేపట్టాలని.. అలాగే టీటీడీ ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్య రంగాల్లో చిరునామాగా మారాలి అన్నారు.భక్తుల సౌకర్యార్థం అన్ని భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే, భక్తులను వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాల్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఆలయాల పనులను బోర్డు సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే ఐదు వేల ఆలయాల రూపకల్పనలో ఆధ్యాత్మికత, ప్రశాంతత ప్రధానంగా ఉండాలన్నారు. ఈ ఆలయాల నిర్మాణ పనులను టీటీడీ పాలకమండలి సభ్యుల కమిటీ పర్యవేక్షిస్తుందని.. పాత ఆలయాల పునరుద్ధరణ పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలోనూ, విదేశాల్లోనూ నిర్మించే ప్రతి కొత్త ఆలయం టీటీడీ ప్రధాన ఆలయంతో అనుసంధానం అవుతుందని.. శ్రీవారి ఆస్తులు, ధనం విషయంలో పారదర్శకత పాటించాలన్నారు. వాటి దుర్వినియోగాన్ని అరికట్టాలి. తిరుమలలో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను దేవాదాయశాఖలోని ముఖ్యమైన ఆలయాల్లో కూడా అమలు చేయాలని సూచించారు.