నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి మంత్రి జూపల్లికృష్ణారావు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలి
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజా సేవతోనే మంచి గుర్తింపు.. సర్పంచులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం
నిర్మల్/ఖానాపూర్/ ముధోల్- డిసెంబర్ 27: నూతనంగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాన్ని పక్కన పెట్టి, ప్రజా సేవనే పరమావధిగా భావించి పనిచేయాలి అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సర్పంచులను శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. వారి బాధ్యతలను గుర్తు చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అప్పుడే మీరు ప్రజా సేవలో మంచి పేరు తెచ్చుకోగలరు అని మంత్రి దిశా నిర్దేశం చేశారు.గ్రామాల్లో పారదర్శక పాలన అందించడంలో గ్రామ సభల ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించాలని, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టబోతోంది. ఈ పథకాల గురించి సర్పంచులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చూడాలి అని మంత్రి కోరారు. ప్రజల మెప్పు పొందేలా పనిచేసి, ప్రతి సర్పంచ్ ఒక ఆదర్శ నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని మొత్తం 1551 స్థానాల్లో పార్టీల వారీగా గెలుచుకున్న వివరాలను వెల్లడించారు: కాంగ్రెస్: 820 స్థానాలు (విజయకేతనం) బీఆర్ఎస్: 343 స్థానాలు బీజేపీ: 269 స్థానాలు స్వతంత్రులు: సుమారు 110 స్థానాల్లో విజయం సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
