బాధిత మహిళ న్యాయవాదిని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు…
రుద్రూర్, ఫిబ్రవరి 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి )
రుద్రూర్మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో ఓ మహిళ న్యాయవాదిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడంతో విషయం తెలుసుకున్న బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులకర్ణి మంగళవారం బాధిత మహిళ న్యాయవాదిని పరామర్శించారు. దాడికి పాల్పడిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల క్రితం బాన్సువాడలో, నిన్న రుద్రూర్ లో ఓ వర్గం పై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడులు చేశారన్నారు. మత విద్వేషాలను సృష్టించడానికి ఇలాంటి దాడులు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బాధిత మహిళా న్యాయవాదిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన వీడియోలు ఆధారాలతో సెల్ ఫోన్ లో చిత్రీకరించిన కూడా ఈ కేసు విషయంలో సీఐ,ఎస్ఐ పట్టించుకోకుండా ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత మహిళ న్యాయవాది పై దాడికి పాల్పడిన వ్యక్తులను శిక్షించాలన్నారు. మహిళా న్యాయవాదికి బిజెపి పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు పార్వతి మురళి, కటికే రామ్ రాజ్, ఎముల గజేందర్, అనిల్, కుమ్మరి గణేష్, వడ్ల సాయినాథ్, మహేందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.