PS Telugu News
Epaper

అటవీ భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ఘాటైన హెచ్చరిక

📅 13 Nov 2025 ⏱️ 12:16 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం చేతిలో ఉన్న 104 ఎకరాల అటవీ భూముల వ్యవహారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ భూముల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించమని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. అటవీ భూములను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, భవిష్యత్ తరాలకు అందజేయడం మన కర్తవ్యం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్ట్‌ను ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అటవీ శాఖను ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక కీలకమని, అందులో ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని అన్నారు. అటవీ భూములను ఎవరు ఆక్రమించారో, ఎంత భూమి ఆక్రమించారో ప్రజలకు తెలియాలని ఆదేశించారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలను శాఖ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని, ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలన్నారు పవన్. ఎవరి అధీనంలో ఎంత భూమి ఉందో..? వారిపై నమోదైన కేసుల స్థితి ఏంటి..? ఈ వివరాలన్నీ పారదర్శకంగా బయటపెట్టాలని పవన్ ఆదేశించారు.మంగళంపేట సర్వే నంబర్లు 295, 296ల్లో భూమి విస్తీర్ణం కాలక్రమంలో పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. సర్వే నంబర్లను సబ్‌డివిజన్ చేసి, అడవి భూములను ఒక ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయని పవన్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక రకమైన భూ లెక్కలు, అండంగల్‌లో మరో రకమైన భూ లెక్కలు ఉన్నాయన్న సందేహాలపై కూడా పవన్ సీరియస్‌గా స్పందించారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లోనూ మతలబు ఉన్నట్లు కనిపిస్తోందని, అదే రిజిస్ట్రేషన్‌లో 45.80 ఎకరాలు చూపిస్తే వెబ్‌ల్యాండ్‌లో 77.54 ఎకరాలు ఎలా అయ్యాయని పవన్ ప్రశ్నించారు.మాజీ మంత్రి కుటుంబం అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వమని చెబుతున్నప్పటికీ.. అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది? ఎప్పుడు, ఎలాగా చేతులు మారింది? ఎవరి ప్రమేయం ఉంది? అన్న అంశాలపై పవన్ దృష్టి సారించారు. ఈ అంశాలన్నింటిపై పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్‌లో ఈ అటవీ భూముల గురించి తప్పుడు సమాచారం అందించారని తన దృష్టికి వచ్చిందని పవన్ వెల్లడించారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని సూచించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని చట్టపరమైన చర్యలు చేపట్టాలని పవన్ అధికారులకు సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనోధైర్యంతో ముందుకు వెళ్లండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి న్యాయం పక్షంలో నిలబడే ధైర్యం ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. ప్రజలకు, జాతికి చెందిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.

Scroll to Top