PS Telugu News
Epaper

హిట్ మూవీ ‘కే ర్యాంప్’ ఇప్పుడు డిజిటల్! ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభ తేదీ ఖరారు

📅 08 Nov 2025 ⏱️ 1:40 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :యువ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ‘కే ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టుగా నిలిచింది. మిక్స్‌డ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్‌గా మారడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, కిరణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సూపర్ హిట్ మూవీ నవంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీకి అభిమానుల్లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. ‘కే ర్యాంప్’ సినిమాతో దర్శకుడిగా జైన్స్ నాని టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను అలరించి, మంచి మార్క్ సాధించాడు. హీరోయిన్‌గా యుక్తి తరేజా మెప్పించారు. సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, అనన్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. సీనియర్ నటి విమలా రామన్ గెస్ట్ రోల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు అబ్బాయి.. కేరళ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి ఉన్న మానసిక సమస్యల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌ల మేళవింపుతో దర్శకుడు తెరపై చూపించాడు. ఈ కథలో కుమార్ పాత్రలో కిరణ్ అబ్బవరం తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దీపావళి సీజన్‌లో విడుదలైన తెలుసు కదా, మిత్రమండలి, డ్యూడ్ వంటి సినిమాల పోటీని తట్టుకుని, కే ర్యాంప్ టాప్‌లో నిలవడం గమనార్హం. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు ఆరు కోట్లకుపైన లాభాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కే ర్యాంప్ సక్సెస్‌తో కిరణ్ అబ్బవరం ఇప్పుడు సూపర్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం అతని వద్ద ఐదు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. వాటిలో చెన్నై లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమవుతుండగా, మరో నాలుగు సినిమాలు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

Scroll to Top