శ్మశానంలో అస్థికల చోరీ ఘటన- లాకర్ పగలగొట్టి అస్థికలు అపహరణ
పయనించే సూర్యుడు న్యూస్ :హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా శ్మశానవాటికలో దుండగులు, అక్కడ లాకర్లను పగులగొట్టారు. అందులో ఓ వృద్ధురాలి అస్థికలను ఎతుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోలన్ జిల్లాలోని చంబాఘాట్ శ్మశానవాటిక ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అస్థికలు భద్రపరిచే గది వైపు వెళ్లారు. అక్కడ ఉన్న ఒక లాకర్ తాళాన్ని పగులగొట్టారు. లోపల ఉన్న అస్థికల కుండను అపహరించారు. అస్థికలతో పాటు అక్కడ ఉంచిన పూజా సామగ్రి, ప్లేటు, ఇతర పాత్రలను కూడా దొంగిలించారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి వేళ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోలన్ నగరంలోని వార్డు నంబర్-5కు చెందిన కమల్ పాల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి 10 రోజుల క్రితం మృతి చెందారని అంత్యక్రియల తర్వాత అస్థికలను సేకరించి చంబాఘాట్ లాకర్లో ఉంచామన్నారు. వాటిని హరిద్వార్ తీసుకెళ్లి గంగలో కలపాల్సి ఉందని తెలిపారు. అస్థికలు తీసుకువెళ్లేందుకు రాగా, లాకర్ పగులగొట్టి ఉండటం గమనించామన్నారు. బాధితుడు కమల్ పాల్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు. లాకర్ పగులగొట్టడానికి వాడిన పరికరాల గురించి ఆరా తీస్తున్నారు. వేలిముద్రల నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసును సోలన్ జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్ సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా అస్థికలతో పాటు వెండి, రాగి, ఇత్తడి పాత్రలు ఉంచుతారు. కేవలం ఆ పాత్రల కోసమే దొంగలు అస్థికల కుండను ఎత్తుకెళ్లారా? అస్థికలను ఉపయోగించి క్షుద్రపూజలు చేసే ముఠాలు ఏమైనా ఈ పని చేశాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శ్మశానవాటికలో పనిచేసే స్థానిక సిబ్బందిని, వాచ్మెన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాకర్ల గురించి తెలిసిన వారి పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చంబాఘాట్ శ్మశానవాటికలో గతంలో ఫోర్జరీ ఘటన జరిగింది. బతికున్న మహిళకు ఇక్కడి సిబ్బంది డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం అప్పట్లో దుమారం రేపింది. ఇప్పుడు ఏకంగా లాకర్లు పగులగొట్టి అస్థికలు దొంగిలించడం ఇక్కడి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.