ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.కొణిజెర్ల గ్రామానికి చెందిన సిహెచ్. రామ లక్ష్మణులు దరఖాస్తు సమర్పిస్తూ, అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతున్న కొణిజెర్ల గ్రామ పంచాయతీ పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని కోరగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఏన్కూరు గ్రామ ప్రజలు గ్రామం పరిధిలో గల చెరువు క్రింద వరి పొలాలు కలిగిన రైతులు వర్షం వచ్చినప్పుడు చెరువు నిండి పొలాల్లో 4 అడుగుల వరకు నీరు నిలిచి వరి పంట నష్టపోతున్నా మని, ఏన్కూరు నుండి గార్ల ఒడ్డు వరకు కొత్తగా పోసే రోడ్డుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గర మోరీలు కట్టాలని, రోడ్డు ప్రక్కన కాలువ తీయాలని, కాల్వ వెడల్పు చేయటం కొరకు దరఖాస్తు చేసుకోగా డిపిఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కొణిజెర్ల మత్స్య శాఖ సొసైటీ అధ్యక్షులు రెడ్డి బోయిన వెంకన్న గ్రామంలో ఉన్నటు వంటి ఊరు చెరువు, చీకటి చెరువులు భూ కబ్జాకు గురవుతున్న విషయం గురించి ఫిర్యాదు చేస్తూ వీటిని సంరక్షించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.మధిరలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రి పిహెచ్సి సబ్ సెంటర్ ను కొత్త బిల్డింగ్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పాత భవనానికి షిఫ్ట్ చేయడం గురించి దరఖాస్తు చేసుకోగా డీఎంహెచ్ఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్ష రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
