
పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం :వివిధ సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం శేఖరం బంజర గ్రామంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పర్యవేక్షించి, రోగుల రికార్డులు, రిజిస్టర్లు, ఔషధ నిల్వలు, వ్యాక్సిన్ భద్రత, ల్యాబ్ సదుపాయాలను నిశితంగా పరిశీలించారు.తనిఖీ సందర్భంగా వైద్యులు,నర్సింగ్ సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్ , ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సమయానికి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించి, విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సేవలలో ఎలాంటి లోపం జరగరాదని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత, మందుల పంపిణీ, హాజరు రికార్డులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. వ్యాక్సిన్ నిల్వ ఫ్రీజర్ను స్వయంగా పరిశీలించి కోల్డ్చెయిన్ సక్రమంగా నిర్వహించబడుతోందో లేదో తనిఖీ చేశారు. టీకా భద్రత విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా భవనంలోని పైకప్పు స్లాబ్ లీకేజీ సమస్యను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు.జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు నమ్మకమైన వైద్యసేవల కేంద్రంగా మారాలని, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు ప్రభుత్వ వైద్యసేవలను మరింత విశ్వాసంతో వినియోగించుకోవాలని ఆయన కోరారు.అదేవిధంగా, జిల్లాలో ఆరోగ్య సేవల మెరుగుదలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక వైద్య సదుపాయాలు మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు.ఈ తనిఖీ లో కలెక్టర్ వెంట డాక్టర్ కృష్ణకుమారి, పి హెచ్ ఓ శ్రీనివాస్, ఎల్ టి శృతి, స్టాఫ్ నర్స్ రాములమ్మ, ఫార్మాసిస్ట్ లలిత, మెడికల్ అసిస్టెంట్ సుధాకర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.