PS Telugu News
Epaper

“జీవితాన్ని రక్షించుకోండి… లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టులు వెంటనే నన్ను సంప్రదించండి”

📅 19 Nov 2025 ⏱️ 4:15 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత.. ఏపీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.. నిన్న హిడ్మా.. ఆయన భార్య రాజక్క సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. ఈ క్రమంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మరో నేత మల్లోజుల వేణుగోపాల్ సంచలన వీడియో రిలీజ్ చేశారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా ఒక ఫోన్ నెంబర్‌ను సైతం బహిర్గతం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. అడవుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటీవల హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించడం తనకు తీవ్ర బాధ కలిగించిందని వేణుగోపాల్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రాణాలు కోల్పోతున్న ప్రతి మావోయిస్టు కుటుంబానికి బాధ తప్ప మరేదీ మిగలడం లేదని, హింస ఇక పరిష్కార మార్గం కాదని స్పష్టం చేశారు. గతంలో అరణ్య ప్రాంతాల్లో ప్రభావం చూపిన మావోయిస్టు దళాలు ఇప్పుడు మారుతున్న పరిస్థితులను గమనించాలని, దేశం మారుతున్నందున హింసకు దూరంగా ఉండాలని కోరుతూ, మల్లోజుల వేణుగోపాల్ ఒక వీడియో విడుదల చేశారు..“మావోయిస్టులు లోంగిపోవాలి.. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవద్దు. లోంగిపోవాలనుకునేవారు ఎప్పుడైనా నన్ను సంప్రదించండి” అంటూ వేణుగోపాల్ తన ఫోన్ నంబర్ 8856038533 కూడా వీడియోలో వెల్లడించారు. తనతో మాట్లాడేందుకు, సహాయం కావాలనుకునేవారికి తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం పరిస్థితులు బాగోలేదని.. అందరూ లొంగిపోవాలని కోరారు.. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది.. అందుకే మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా.. అంటూ మల్లోజుల వేణుగోపాల్ వివరించారు.మల్లోజుల వేణుగోపాల్ చేసిన ఈ పిలుపు గడ్చిరోలి జిల్లా పోలీసుల దృష్టిని ఆకర్షించగా, వారు వీడియోను విడుదల చేసి, ఇది మావోయిస్టు సమస్య పరిష్కారానికి కీలక అడుగు కావొచ్చని భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా మావోయిస్టుల నుండి లొంగిపోయే ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలోఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది. మావోయిస్టులకు సామాజిక జీవితంలోకి తిరిగి రావాలని, ప్రభుత్వం అందించే పునరావాస పథకాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Scroll to Top