PS Telugu News
Epaper

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనుక్కా వేడుకల కోసం వందలాది యూదు కుటుంబాలు బీచ్‌లో ఉన్న సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్, నవీద్ జరిపిన కాల్పులలో 16 మంది చనిపోయారు. మరో 25 మంది గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కారు డాష్‌క్యామ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బోరిస్, సోఫియా గుర్మన్ అనే వృద్ధ దంపతులు ప్రాణాలకు తెగించి ఒక దుండగుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది. లావెండర్ టీ-షర్ట్ ధరించిన బోరిస్, సాయుధుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, సోఫియా అతనికి తోడుగా నిలిచారు. ఈ పోరాటంలో వారు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు వారు చూపిన ధైర్యం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే పండ్ల వ్యాపారి చేసిన సాహసం అద్భుతం. ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా ఫుట్‌బ్రిడ్జిపై కాల్పులు జరుపుతున్న నిందితుడి తుపాకీని అహ్మద్‌ తన వైపుకి లాక్కున్నాడు. అహ్మద్ కు రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. అతను తుపాకీని లాక్కొని, పెను రక్తపాతాన్ని నివారించారని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పండ్ల వ్యాపారిని ప్రశంసించారు. ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిడ్నీ కాల్పుల ప్రధాన నిందితుడు సాజిద్ హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందినవాడు. 27 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్, అక్కడ ఒక క్రైస్తవ మహిళను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న అతను.. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మాత్రమే హైదరాబాద్‌ వచ్చి వెళ్లేవాడు. సాజిద్ కుమారుడు నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. వీరిద్దరూ దాడికి ముందు ఫిలిప్పీన్స్‌లోని దావో నగరానికి వెళ్లి, ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 28 రోజుల పాటు ఉగ్రవాద శిక్షణ పొందినట్లు దర్యాప్తులో తేలింది. సాజిద్ భారతీయ పాస్‌పోర్ట్‌పై, నవీద్ ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించి బోండీ బీచ్‌లో తమ కుట్రను అమలు చేశారు.

Scroll to Top